విజయాలను అనుగ్రహించే విష్ణు క్షేత్రం

విజయాలను అనుగ్రహించే విష్ణు క్షేత్రం

విజయాలను అనుగ్రహించే విష్ణు క్షేత్రం
పూర్వం మహారాజులకు ... చక్రవర్తులకు వీరత్వమే ఆభరణమై అందంతోపాటు కీర్తిపతిష్ఠలు తెచ్చిపెట్టేది. అనేక విద్యలను అభ్యసించినప్పటికీ తమ పరాక్రమానికీ ... విజయాలకు మూలం భగవంతుడి యొక్క అనుగ్రహమేనని భావించేవాళ్లు. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఎక్కువగా చెన్నకేశవస్వామిని ఆరాధించేవాళ్లు. ఈ స్వామిని పూజించడం వలన వీరత్వం పట్టుసడలదనీ ... విజయం చేజారిపోదని విశ్వసించే వాళ్లు.

ఈ కారణంగానే ఆనాటి రాజులు చెన్నకేశవస్వామి ఆలయాలను విరివిగా నిర్మించారు ... వాటి అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. అలాంటి ఆలయాలలో చిత్తూరు జిల్లా 'సోంపాళ్యం' ఒకటిగా కనిపిస్తుంది. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం, విజయనగర రాజుల కాలంలో మరింతగా అభివృద్ధికి నోచుకుని తన విశిష్టతను చాటుకుంటోంది.

చోళుల స్వామి భక్తికీ ... విజయనగర రాజుల అంకితభావానికి ఈ ఆలయం ఓ మచ్చుతునకగా నిలుస్తుందని చెప్పవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో బండరాళ్ల అమరికతో ఈ ఆలయం నిర్మించబడింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో ఎంతసేపు గడిపినా సమయం తెలియదు. శిల్పకళాశోభితమైన రాజగోపురం ... ప్రాకారాలు ... మంటపాలు ... స్తంభాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

గర్భాలయంలో స్వామివారు ... ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తుంటారు. అలనాటి వైభవానికి గుర్తుగా నిలిచిన ఈ క్షేత్రంలో అడుగుపెడితే, తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని ఈనాటికీ భక్తులు విశ్వసిస్తుంటారు. పర్వదినాల సమయంలో స్వామివారిని మరింత భక్తి శ్రద్ధలతో సేవించి తరిస్తుంటారు.

More Bhakti Articles