తల్లిదండ్రుల సేవా ఫలితం

తల్లిదండ్రుల సేవా ఫలితం
తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసి ... భార్యను దూరం చేసుకుని ... వేశ్య చేతిలో మోసపోయిన పుండరీకుడు ఊరు విడిచి వెళ్లిపోతాడు. నిరాశా నిస్పృహలతో అనేక ప్రాంతాలు తిరుగుతూ, అలసిపోయి 'కుక్కుట మహర్షి' ఆశ్రమ సమీపానికి చేరుకుంటాడు. అదే సమయంలో గంగ ... యమున ... సరస్వతి కలిసి కుక్కుట మహర్షి ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమానికి అవసరమైన పనులు చేసి మహర్షి పాద స్పర్శచే తమ పాపాలను కడిగేసుకుని పరిశుద్ధులవుతారు.

అక్కడి నుంచి వాళ్లు బయలుదేరుతూ పుండరీకుడి కంటపడతారు. ఆ ముగ్గురి అందచందాలు చూడగానే అతనికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది. పుండరీకుడు ఒక్కసారిగా మీదకి రావడంతో, ఆ ముగ్గురూ బెదిరిపోయి మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అదృశ్యమవుతారు. వారి వెనుకే ఆశ్రమంలోకి పరిగెత్తుకు వస్తాడు పుండరీకుడు. ఆ సమయంలో కుక్కుట మహర్షి తన తండ్రికి పాదసేవ చేస్తుంటాడు.

ఆశ్రమంలోకి వచ్చిన అతివలు కనిపించక పోవడంతో, వారిని గురించి కుక్కుట మహర్షిని అడుగుతాడు పుండరీకుడు. తండ్రి పాదసేవలో నిమగ్నమైన మహర్షి ఆ మాటలు వినిపించుకోడు. అది అవమానంగా భావించి ఆవేశంతో మహర్షిని తన్నడానికి వస్తాడు పుండరీకుడు. అంతే అతని కాళ్లు చచ్చుబడిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తాను అంతలా ప్రవర్తించినా మహర్షి ప్రశాంతంగా వుండటం చూసి సిగ్గుపడతాడు. తన తప్పును మన్నించమని మహర్షిని పాదాలపై పడతాడు.

కామంతోను ... అహంకారంతోను కళ్లు మూసుకుపోయిన అతనికి అది దైవం విధించిన శిక్షగా చెబుతాడు మహర్షి. తల్లిదండ్రుల సేవ వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందనీ, వాళ్ల మనసుకి కష్టం కలిగించిన వారికి దుర్గతులు తప్పవని అంటాడు. తల్లిదండ్రుల సేవలో తరించినప్పుడే అతనికి తిరిగి కాళ్లు వస్తాయని సెలవిస్తాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్ల పర్యంతమైన పుండరీకుడు, మహర్షి హితవును పాటించడానికి నిర్ణయించుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు.

More Bhakti Articles