మహర్షి తపస్సుచే వెలసిన క్షేత్రం

మహర్షి తపస్సుచే వెలసిన క్షేత్రం
అలంకారప్రియుడైన వేంకటేశ్వరస్వామి అందరివాడు. అశేష భక్త జనకోటి మనసు మందిరాల్లో కొలువుదీరిన వాడు. దర్శనమాత్రం చేతనే సమస్త పాపాలను హరించువాడు ... అశేష పుణ్యఫలాలను అందించువాడు. చక్కని రూపుతో ... చల్లని చూపుతో భక్తుల హృదయాలను దోచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందే వుంటాడు. పిలిచిందే తడవుగా మలయమారుతంలా వస్తాడు ... తన భక్తులకు మేరుపర్వతంలా అండగా నిలుస్తాడు.

ఈ కారణంగానే ఎంతోమంది మహర్షులు ఆయన కోసం అదే పనిగా తపస్సులు చేశారు ... ఆ స్వామి అనుగ్రహం అందరికీ కలిగేలా చేశారు. అలా 'మాండవ్య మహర్షి' కోరిక మేరకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా 'గుడబల్లూరు' లో దర్శనమిస్తుంది.

పూర్వం ఇక్కడి కొండ గుహలో మాండవ్య మహర్షి కొన్ని సంవత్సరాల పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. తనకి ఎలాంటి కోరికలు లేవనీ, ఈ ప్రదేశంలో ఆవిర్భవించి భక్తుల పాలిట కామధేనువులా వుంటే తన జీవితం చరితార్థం అవుతుందని అన్నాడట. ఆయన అభ్యర్ధనమేరకు స్వామి అమ్మవార్లతో సహా ఇక్కడి గుహలో వెలిశాడు. మహర్షుల పూజలను అందుకున్న ఇక్కడి స్వామి, అటుగా ఎవరూ వెళ్లక పోవడంతో పుట్టల మధ్య ఉండిపోయాడు.

చాలాకాలం తరువాత కొందరు పశువుల కాపరులు తమ పశువులను మేపుకురావడానికి అటుగా వెళ్లారు. అక్కడి గుహ వైపుకు వెళ్లడానికి ఆవులు ప్రయత్నిస్తూ ఉండటం ... అదిలిస్తున్నా లెక్కచేయక పోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయమేవిటో తెలుసుకోవడం కోసం వారే లోపలికి వెళ్లగా, పుట్టల మధ్యలో వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామిని దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అంతా కలిసి ఆపదమొక్కులవాడికి ఆలయాన్ని నిర్మించారు.

సాధారణంగా వెలసిన రూపాలు రాతిపై రేఖా మాత్రంగా ... అస్పష్టంగా కనిపిస్తూ వుంటాయి. కానీ ఇక్కడి గుహలో వెలసిన శ్రీదేవి .. భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారి రూపాలు ఎంతో అందంగా ... స్పష్టంగా దర్శనమిస్తూ వుండటం విశేషం. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles