శివలింగ పూజా నియమం

శివలింగ పూజా నియమం
కార్తీకమాసం అనగానే శివాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఈ మాసంలో చేసే శివారాధన వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా భక్తులు శివానుగ్రహం పొందడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆలయాలలో పూజారులు మాత్రమే శివలింగానికి అభిషేకాలు చేస్తుంటారు. మరికొన్ని ఆలయాల్లో శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం వుంటుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి భక్తులంతా ప్రయత్నిస్తుంటారు కనుక అక్కడి వాతావరణం కాస్త హడావిడిగానే కనిపిస్తూ వుంటుంది. ఈ కంగారులోనే కొంతమంది భక్తులు పాలతో పరమశివుడిని అభిషేకించి ఆ చెంబును 'పానవట్టం' పైన పెడుతుంటారు. మరికొందరు స్వామివారికి అభిషేకం అనంతరం నైవేద్యం సమర్పించాలనే ఆరాటంతో, అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ చిప్పలను, తాము తీసుకొచ్చిన పండ్లను పానవట్టం పైన పెట్టేస్తుంటారు.

ఇంకొందరు స్వామివారిని అలంకరించాలనే ఆలోచనతో తమవెంట తెచ్చిన బుట్టలో నుంచి కుంకుమ ... గంధం గిన్నెలు, అగరొత్తులు ... కర్పూరం డబ్బాలు ఒక్కొక్కటిగా తీసి పానవట్టంపై సిద్ధంగా ఉంచుతుంటారు. పానవట్టాన్ని వాళ్లు ఒక వేదికలా చూడటమే అందుకు కారణమని చెప్పవచ్చు. తెలిసో ... తెలియకో ఈ విధంగా చేయడం వలన దోషాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుందని శాస్త్రం చెబుతోంది.

పూజకి సంబంధించినవే అయినా ఏ వస్తువు కూడా పానవట్టంపై పెట్టకూడదనేది శివలింగ పూజలో ప్రధానమైన నియమంగా కనిపిస్తూ వుంటుంది. ఆ నియమాన్ని పాటించకపోవడం వలన, పుణ్యం రాక పోగా పాపాన్ని తలకెత్తుకోవలసి వస్తుంది. అందువలన శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహించేటప్పుడు, భక్తి శ్రద్ధలతో పాటు నియమ నిష్టలను కూడా దృష్టిలో పెట్టుకోవలసి వుంటుంది. అప్పుడే శివయ్య అనుగ్రహం లభిస్తుంది ... ఆశించిన ఫలితం దక్కుతుంది.

More Bhakti Articles