కసితీరా చంపుతానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు బెదిరింపులు

  • నాలుగేళ్ల క్రితం విజయశాంతి భర్తకు పరిచయమైన చంద్రకిరణ్‌రెడ్డి
  • సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తానని చెప్పుకున్న వైనం
  • కాంట్రాక్ట్ కుదుర్చుకోకున్నా డబ్బుల కోసం డిమాండ్ 
  • ఇవ్వకుంటే చంపుతానని బెదిరింపు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం ఎం.చంద్రకిరణ్‌రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు.

అయితే, చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నాయకుల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తావని శ్రీనివాస ప్రసాద్‌కు నిందితుడు మెసేజ్ పెట్టాడు. ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విజయశాంతి భర్త.. ఇంటికి వచ్చి మాట్లాడాలని సూచించారు. ఇంటికి రాలేదు సరికదా.. తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డున పడేస్తానని, కసి తీరేవరకు దారుణంగా చంపుతానని బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News