వల్ల‌భ‌నేని వంశీకి మళ్లీ నిరాశ‌.. రిమాండ్ పొడిగింపు

  • గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు
  • వంశీకి ఏప్రిల్ 9 వరకు రిమాండ్‌ను పొడిగించిన సీఐడీ కోర్టు 
  • సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఇప్ప‌టికే రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ  
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని ఈ రోజు ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. 

ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9 వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది.  సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడిగించ‌డంతో ఆయ‌న‌ను విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు. మ‌రోవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. 

ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నేటి సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.




More Telugu News