టీఎన్సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్
- ప్రస్తుత అధ్యక్షుడు సెల్వపెరుంతగైపై ఏఐసీసీ వేటు
- డీఎంకేకు అనుకూలంగా ఉన్నారనే కారణంతో సెల్వపెరుంతగై తొలగింపు
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన తర్వాత ఈ మార్పు
- సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేతో బంధం బలోపేతమే లక్ష్యం
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తును మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సెల్వపెరుంతగై డీఎంకే పట్ల సానుకూల ధోరణితో ఉన్నారనే అభిప్రాయం పార్టీలో ఉండగా, మాణికం ఠాకూర్ ఆది నుంచి టీవీకేతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారు. డీఎంకేతో పొత్తును ఆయన గతంలో బహిరంగంగానే వ్యతిరేకించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, 27 స్థానాల్లో బరిలోకి దిగి కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్, అధికార టీవీకేతో జతకట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ విప్గా వ్యవహరిస్తున్న మాణికం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా నియామకం పట్ల, టీవీకే మద్దతుతో రాజ్యసభ ఎంపీ అయిన ప్రవీణ్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. మాణికం ఠాకూర్ నాయకత్వంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్నిర్మితమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.