ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా!

Revanth Reddy bumper gift for employees 12 crore free insurance without premium
  • దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం 
  • అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14  బ్యాంకులతో ఒప్పందం
  • ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం
  • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలో ఆర్థిక భద్రతను పెంపొందించే దిశగా రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం మరో అద్భుతమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన సమగ్ర ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 14 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఉద్యోగులపై కానీ, ప్రభుత్వ ఖజానాపై కానీ ఎలాంటి ప్రీమియం భారం పడకుండా కేవలం జీతాల ఖాతాలు ఉండే బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఈ ఉచిత బీమాను అందించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.

ఈ సరికొత్త బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందితో కలిపి దాదాపు 10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. బ్యాంక్ ఖాతాల ద్వారా జీతాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ రక్షణ లభిస్తుంది. ఉద్యోగి జీతం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం రూ.60 లక్షల నుండి గరిష్టంగా రూ.1.2 కోట్ల వరకు వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే ఈ పరిహారాన్ని రూ.2 కోట్లకు పెంచారు. గతంలో సింగరేణి కాలరీస్ కార్మికులకు పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని అమలు చేయగా, అక్కడ దురదృష్టవశాత్తు మరణించిన సుమారు 45 మంది కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగుల ప్రమాద బీమా పథకానికి ఆమోదం లభించింది. ఇప్పుడు పరిపాలనాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఇది కార్యరూపం దాల్చుతోంది. ఈ బీమాతో పాటు సహజ మరణం సంభవిస్తే (60 ఏళ్ల లోపు) రూ.10 లక్షల టర్మ్ లైఫ్ కవర్ కూడా ఉద్యోగులకు లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్‌జీవో)తో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రవీంద్రభారతిలో జరిగే ప్రారంభోత్సవానికి ఉద్యోగులందరూ తమ గుర్తింపు కార్డులతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, జులై మొదటి వారంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ డిజిటల్ హెల్త్ కార్డ్‌లను (ఈహెచ్ఎస్) కూడా పంపిణీ చేయడానికి, కొత్త పీఆర్‌సీ అమలుపై దృష్టి పెట్టడానికి రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Government Employees
Free Accident Insurance Scheme
Employee Welfare Schemes
Telangana State Government
TNGOs Association

More Telugu News