చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు
- పెద్ది' సక్సెస్ మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనైన దర్శకుడు బుచ్చిబాబు సాన
- నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం
- చిన్నప్పుడు పిఠాపురం నుంచి చిరంజీవికి ఉత్తరాలు రాసిన జ్ఞాపకాలు పంచుకున్న వైనం
- తన గురువు సుకుమార్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన శిష్యుడిగానే గర్వపడతానన్న బుచ్చిబాబు
- ఒక వృద్ధ ప్రేక్షకుడు చెప్పిన మాటలు తన జన్మకు చాలని ఉద్వేగభరితంగా వ్యాఖ్య
రామ్ చరణ్ అంకితభావం గురించి బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "చరణ్ గారు ఒక స్టార్ హీరో, నటుడు. ఆయనతో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయడం చాలా సులభం. కానీ 'పెద్ది' లాంటి కథను నమ్మారు. సెట్కు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ స్టార్లా కారు దిగారేమో గానీ, సెట్లోకి అడుగుపెట్టేటప్పుడు మాత్రం 'పెద్ది' పాత్రధారిగానే నడిచి వచ్చారు. నేను రాసుకున్న పాత్రకు ఆయన తన నటనతో పది రెట్లు ప్రాణం పోశారు. నేను రాసుకున్న కథను, పెద్ది క్యారెక్టర్ను ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఈ విషయంలో చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను" అని ఉద్వేగంగా తెలిపారు.
తన బాల్యం నాటి అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ, "చిరంజీవి గారికి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఆయన ఇంటి అడ్రస్కు లెటర్లు రాసేవాడిని. ఇప్పుడు నా మొదటి కథ, రెండో కథ 'పెద్ది' కూడా ఆయన ఇంటికే చేరడం నా సంకల్పానికి దక్కిన విజయంగా భావిస్తున్నాను," అని బుచ్చిబాబు అన్నారు. ఒక మనిషి సంకల్ప బలం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నమే 'పెద్ది' కథ అని ఆయన వివరించారు.
తన గురువు సుకుమార్కు కృతజ్ఞతలు తెలుపుతూ, "సుకుమార్ గారు లేకపోతే నేను లేను. నన్ను 'డైరెక్టర్ బుచ్చిబాబు' అని పిలవడం కన్నా, 'సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు' అని పిలిస్తేనే నాకు ఎక్కువ విలువ, గర్వం. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని అన్నారు. అలాగే, నిర్మాత సతీష్ కిలారి, ఇతర సాంకేతిక నిపుణులు రత్నవేలు, ఏఆర్ రెహమాన్, నవీన్ నూలి, అవినాష్లకు, తన డైరెక్షన్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా, తనను వెనకుండి నడిపించింది తన టీమేనని కొనియాడారు.
ప్రేక్షకుల స్పందన గురించి మాట్లాడుతూ, "మొన్న థియేటర్కు వెళ్లినప్పుడు 75 ఏళ్ల పెద్దాయన ఒకరు నా దగ్గరకు వచ్చి, 'బాబు, 25 ఏళ్ల క్రితం మాతృదేవోభవ సినిమా చూసి ఏడ్చాను. మళ్లీ ఇన్నాళ్లకు మీ సినిమా చూసి ఏడ్చాను' అన్నారు. ఆ మాట వినగానే ఈ జన్మకు ఇది చాలురా అనిపించింది" అంటూ బుచ్చిబాబు తన ఆనందాన్ని పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.