23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్బై చెప్పిన ఫిట్నెస్ కోచ్..!
- 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్నెస్ కోచ్
- అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం
- చక్కెర పానీయాలకు గుడ్బై
- పరిమితికి మించి తినడంపై నియంత్రణ
- కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్
‘‘క్రాష్ డైట్లు చేయలేదు.. డిటాక్స్ టీలు తాగలేదు.. ఆకలితో ఉండలేదు. కేవలం చెడు అలవాట్లను మానేశాను’’ అని శిఖా పేర్కొంది. మొదటగా ఉదయం అల్పాహారం మానేయడం ఆపేసినట్లు తెలిపింది. గతంలో ఉదయం తినకుండా ఉండి, రాత్రికి ఎక్కువగా తినేదాన్నని చెప్పింది. ఇప్పుడు లేచిన గంటలోపే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లు వెల్లడించింది.
జ్యూసులు, అధిక చక్కెరతో టీలు, కోల్డ్ కాఫీలు తాగడం కూడా మానేసినట్లు శిఖా వెల్లడించింది. వాటి స్థానంలో నీళ్లు, బ్లాక్ కాఫీ, తక్కువ చక్కెరతో టీ తీసుకోవడం ప్రారంభించింది. మఖానా, డ్రైఫ్రూట్స్, పీనట్ బటర్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా పరిమితికి మించి తింటే బరువు పెరుగుతామని చెప్పింది. ఆహారం ఆరోగ్యకరమైనదే అయినా క్యాలరీలు మాత్రం లెక్కలోకి వస్తాయని వివరించింది.
కేవలం కార్డియో వ్యాయామాలకే పరిమితం కాకుండా వెయిట్ ట్రైనింగ్ ప్రారంభించిన తర్వాతే తన శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపించాయని తెలిపింది. తగినంత నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి కూడా బరువు తగ్గడాన్ని అడ్డుకుంటాయని పేర్కొంది. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని సూచించింది.
బయట తినడం మానేసి, ఎక్కువగా ఇంట్లోనే వండుకుని తినడం ప్రారంభించినట్లు శిఖా తెలిపింది. ఒక్కసారి డైట్ తప్పితే అంతా పాడైపోతుంది అనే ఆలోచనను కూడా వదిలేసినట్లు చెప్పింది. ఒక పిజ్జా ముక్క తిన్నంత మాత్రాన మొత్తం ప్రయాణం ఆగిపోదని, పరిపూర్ణత కంటే నిలకడ ముఖ్యమని వివరించింది. చివరగా మోటివేషన్ వస్తేనే మొదలుపెడతాను అనే అలవాటును మానేయాలని సూచించింది. మోటివేషన్ కోసం ఎదురుచూడకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పింది.