విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్లో సూసైడ్
- హైదరాబాద్ మల్లాపూర్లోని ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఆత్మహత్య
- విషం ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
సోమవారం రాత్రి నుంచి డాక్టర్ ఖాసీఫ్ స్టాఫ్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి అనుమానం కలిగింది. తలుపులు తట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన విగతజీవుడిలా కనిపించారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, డాక్టర్ ఖాసీఫ్ విషపూరిత ఇజెక్షన్ వేసుకోవడం వల్లే మరణించి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.