దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల కోట్ల ఆదాయం
- టెలికాం రంగంపై కీలక నివేదిక విడుదల చేసిన ట్రాయ్
- గణనీయంగా పెరిగిన బ్రాడ్బ్యాండ్, వైర్లెస్ వినియోగదారులు
- ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ.196కి పెరుగుదల
- ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.6,936 కోట్ల ఆదాయం
ట్రాయ్ నివేదిక ప్రకారం.. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 104.62 కోట్ల మంది వైర్లెస్ (మొబైల్) ద్వారా, 4.65 కోట్ల మంది వైర్డ్ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. వీరిలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 106.58 కోట్లుగా ఉండగా, న్యారోబ్యాండ్ (56 కేబీపీఎస్ కంటే తక్కువ వేగం) సబ్స్క్రైబర్లు 2.69 కోట్లుగా ఉన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ల బేస్ 5.81 శాతం పెరగడం విశేషం.
ఇంటర్నెట్తో పాటు మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా 133.05 కోట్లకు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా టెలి-డెన్సిటీ (ప్రతి 100 మందికి ఉన్న ఫోన్ కనెక్షన్లు) గత త్రైమాసికంలోని 91.74 శాతం నుంచి 93.26 శాతానికి మెరుగుపడింది. వైర్లైన్ టెలి-డెన్సిటీ సైతం 3.33 శాతం నుంచి 3.38 శాతానికి పెరిగింది.
వినియోగదారుల నుంచి వచ్చే సగటు నెలవారీ ఆదాయం (ఏఆర్పీయూ) కూడా టెలికాం సంస్థలకు సానుకూలంగా ఉంది. వైర్లెస్ సేవలకు సంబంధించి ఏఆర్పీయూ 0.76 శాతం పెరిగి రూ.196.04కి చేరింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది 7.15 శాతం పెరుగుదల. అదేవిధంగా, వినియోగ సమయం (ఎంఓయూ) కూడా స్వల్పంగా పెరిగి నెలకు సగటున 1,017 నిమిషాలకు చేరింది.
టెలికాం రంగం వృద్ధి ప్రభుత్వ ఆదాయానికి కూడా ఊతమిచ్చింది. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెలికాం కంపెనీల నుంచి లైసెన్స్ ఫీజు (ఎల్ఎఫ్) రూపంలో ప్రభుత్వానికి రూ.6,936 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.6,733 కోట్లుగా ఉంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన 917 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని కూడా ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.