లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..!
- అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం
- పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు
- సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
అక్రమ నిర్మాణం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేయాలని 2016 మే 10న లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం రెండు నెలల వ్యవధిలోనే, అంటే అదే ఏడాది జులై 5న ఆ ఆదేశాలను అధికారులు రద్దు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సరైన విచారణ జరపకుండానే నోటీసులు ఇచ్చారని, భవన నిర్మాణం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని అప్పటి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేయడంతో, ఆ కూల్చివేత ఆదేశాలు రద్దయ్యాయి. కాగా, 1980వ సంవత్సరం నుంచి ఈ స్థలం పలువురి చేతులు మారుతూ వచ్చిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులుగా నలుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, భవన యజమాని వీరేంద్ర ప్రతాప్ శుక్లాతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.