శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది?
- యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్
- ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు
- ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్
- స్టార్ హీరోయిన్ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
వివరాల్లోకి వెళితే, యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజతో పాటు నటి శ్రీలీల, షాహిద్ కపూర్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక అందరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో కేవలం అమృత, ఆమె కుమార్తె ఫోటోలు కావాలని కొందరు ఫొటోగ్రాఫర్లు అడిగినట్లు సమాచారం. దీంతో అమృతా ఫడ్నవీస్ తన పక్కనే ఉన్న శ్రీలీలను చేతితో సైగ చేసి పక్కకు జరగమని సూచించారు.
ఈ అనూహ్య పరిణామంతో శ్రీలీల కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. వెంటనే ఆమె పక్కకు జరగగా, ఆ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అమృతా ఫడ్నవీస్పై మండిపడుతున్నారు. గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో టాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకున్న శ్రీలీలను బహిరంగంగా అవమానించడం సరికాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక ప్రముఖ నటిని వేడుకకు అతిథిగా పిలిచి ఇలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. ఫొటోగ్రాఫర్లు అడిగినా, ఆ విషయాన్ని గౌరవంగా చెప్పాలే తప్ప ఇలా సైగలతో అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో యోగా దినోత్సవ స్ఫూర్తి దెబ్బతిన్నట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరో వీడియోలో అమృత ఫడ్నవీస్.. శ్రీలీలతో ఆప్యాయంగా మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. తన కుమార్తె దివిజను కూడా ఆమె శ్రీలీలకు పరిచయం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.