ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్పై కార్మిక సంఘాల ఫైర్
- డెట్రాయిట్ ప్లాంట్లో వెయ్యికి పైగా ఉద్యోగాలకు జీఎం కోత
- వారి స్థానంలో 50 కొత్త రోబోలను నియమించిన సంస్థ
- కంపెనీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కార్మిక సంఘాలు
- పోటీతత్వం, భద్రత కోసమే ఈ చర్యలన్న జనరల్ మోటార్స్
మిచిగాన్లోని ‘ఫ్యాక్టరీ జీరో’ ప్లాంట్లో ఈ కొత్త రోబోలను ప్రవేశపెట్టారు. వీటిని ‘కోబోట్స్’ (కొలాబరేటివ్ రోబోట్స్) అని పిలుస్తున్నారు. అసెంబ్లీ లైన్లో మిగిలిన సిబ్బందితో కలిసి ఇవి వాహనాల బాడీ ప్యానెల్స్ను అమర్చే పని చేస్తాయి. తమ కార్యకలాపాల్లో అధునాతన టెక్నాలజీని తీసుకురావడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని జీఎం ప్రతినిధి కెవిన్ కెల్లీ తెలిపారు. "పోటీలో నిలదొక్కుకోవడానికి, కార్మికుల భద్రత, పని సౌలభ్యం మెరుగుపరచడానికి ఈ కోబోట్లు అవసరం. మా బృందంతో కలిపి వీటిని వినియోగిస్తున్నాం" అని ఆయన వివరించారు.
అయితే, జీఎం వాదనను యునైటెడ్ ఆటో వర్కర్స్ (యూఏడబ్ల్యూ) లోకల్ 22 యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది పూర్తిగా ఉద్యోగుల పొట్టకొట్టడమేనని యూనియన్ అధ్యక్షుడు జేమ్స్ కాటన్ ఆరోపించారు. "వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించిన తర్వాత ప్లాంట్లోకి రోబోలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే భవిష్యత్తు అని కంపెనీ చెబుతోంది. అదే నిజమైతే వారు ప్రజల నుంచి ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు" అని ఆయన అన్నారు. తమ ప్లాంట్లలో కోబోట్లను ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నామని కాటన్ స్పష్టం చేశారు.
భారీగా లాభాలు ఆర్జిస్తున్న తరుణంలో ఉద్యోగుల తొలగింపు
ఇదిలా ఉంటే.. జనరల్ మోటార్స్ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఈ తొలగింపులు చేపట్టడం గమనార్హం. 2026 మొదటి త్రైమాసికంలో కంపెనీ ఏకంగా 4.25 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం అధికం కావడం విశేషం. ఇంత భారీ లాభాలు గడిస్తున్న సమయంలో ఉద్యోగులను తొలగించి రోబోలను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఆటోమేషన్తో భవిష్యత్తుకు సిద్ధమవుతున్నామని జీఎం చెబుతుండగా, మరోవైపు ఇది తమ ఉపాధిని దెబ్బతీస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.