టెక్నాలజీతో అఘాయిత్యం.. ఏఐతో విద్యార్థినిని వేధించిన టీచర్ అరెస్ట్
- ఏఐ టూల్స్ వాడి విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్
- అశ్లీల చిత్రాలతో బాలికను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులు
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- పోక్సో చట్టం కింద కేసు నమోదు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు షణ్ముఖ్ హితేష్ తన వద్ద ట్యూషన్ తీసుకుంటున్న బాలిక ఛాయాచిత్రాలను సేకరించాడు. అనంతరం ఏఐ సాంకేతికతతో ఆ చిత్రాలను అశ్లీల మార్ఫింగ్ ఫొటోలుగా మార్చాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ ఫొటోలను ఇతరులకు పంపిస్తానని సదరు బాలికను తీవ్రంగా బెదిరించడం మొదలుపెట్టాడు.
నిందితుడి వేధింపులు మితిమీరడంతో, సదరు బాలిక ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే అప్రమత్తమైన వారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితుడు షణ్ముఖ్ హితేష్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఐటీ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏఐ సాంకేతికతను వినియోగించి మైనర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలకు ఈ ఘటన నిదర్శనమని పోలీసులు పేర్కొన్నారు. పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.