అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే!
- అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు
- ట్రంప్ బెదిరింపుల కారణంగా చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్
- ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైన సంప్రదింపులు
- 60 రోజుల్లో తుది ఒప్పందానికి ఇరు దేశాల అంగీకారం
- హర్మూజ్ జలసంధిలో ఘర్షణల నివారణకు ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్
ట్రంప్ బెదిరింపులతో మొదలైన హైడ్రామా
అయితే, స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఈ చర్చలు అంత సాఫీగా ప్రారంభం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా తీవ్రమైన బెదిరింపులకు పాల్పడటంతో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో చర్చల నుంచి వాకౌట్ చేశారు. "ఇరాన్ తన ప్రాక్సీలను అదుపులో పెట్టాలి, లేదంటే గత వారం కన్నా తీవ్రంగా దాడి చేస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్పై బాంబులు వేస్తామని, చర్చలకు వచ్చిన ఇరాన్ బృందాన్ని కిడ్నాప్ చేస్తామని కూడా ఆయన బెదిరించినట్లు 'ది గార్డియన్' కథనం పేర్కొంది. ఈ అవమానకరమైన సందేశం తర్వాత చర్చలు క్లిష్ట దశలోకి ప్రవేశించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది.
మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు
ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు మధ్యవర్తులుగా ఉన్న ఖతార్, పాకిస్థాన్ వెంటనే రంగంలోకి దిగాయి. ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపి తిరిగి చర్చల ప్రక్రియను గాడిలో పెట్టాయి. దీంతో తిరిగి ప్రారంభమైన చర్చలు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ప్రోత్సాహకరమైన పురోగతి సాధించామని ఖతార్, పాకిస్థాన్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే..
ఈ భేటీలో ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.
హై లెవెల్ కమిటీ: చర్చల పర్యవేక్షణకు, రాజకీయ మార్గనిర్దేశం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అణు, ఆంక్షలు, పర్యవేక్షణ వంటి అంశాలపై వర్కింగ్ గ్రూపులు దీనికి నివేదిక ఇస్తాయి.
60 రోజుల రోడ్మ్యాప్: రెండు నెలల్లో తుది ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ రోడ్మ్యాప్ను సిద్ధం చేశారు.
హర్మూజ్ జలసంధిలో కమ్యూనికేషన్ లైన్: వాణిజ్య నౌకల భద్రత కోసం, అపార్థాలను, ఘర్షణలను నివారించేందుకు ఇరుపక్షాల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ లైన్ ఏర్పాటుకు అంగీకరించారు.
డీ-కాన్ఫ్లిక్షన్ సెల్: లెబనాన్లో సైనిక కార్యకలాపాల ముగింపును పర్యవేక్షించేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్లతో కూడిన ఒక సెల్ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ చర్చల పురోగతిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సంతృప్తి వ్యక్తం చేశారు. లెబనాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం గొప్ప పురోగతిని సాధించిందని ఆయన అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తమ చమురు ఎగుమతులపై ఆంక్షల మినహాయింపు, దిగ్బంధం ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఖలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ చర్చల్లో పాల్గొన్నారు.