'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం
- బంగ్లాదేశ్లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం
- రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు
- నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం
- అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక
- మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
హిందూ మహాజోత్ సహా పలు హిందూ సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఢాకాలోని షాబాగ్ కూడలిలో సమావేశమైన నిరసనకారులు, అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రెస్ క్లబ్ వెలుపల మానవహారం నిర్వహించగా, ఢాకా రిపోర్టర్స్ యూనిటీ (డీఆర్యూ) భవనం దగ్గర మరో నిరసన కార్యక్రమం జరిగింది. మరోవైపు, రంగపూర్లో ప్రదర్శన చేపట్టేందుకు ప్రయత్నించిన హిందువులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
వివాదానికి కారణమైన విగ్రహ ప్రాజెక్ట్
బంగ్లాదేశ్లోని ఉత్తర గైబంధా జిల్లా పలాశ్బరిలో శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా 81 అడుగుల శ్రీరాముడి విగ్రహంతో పాటు, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (సుమారు రూ. 15.6 కోట్లు) అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్లో రాముడి విగ్రహ నిర్మాణం ఇప్పటికే 80 శాతం పూర్తయింది.
అయితే, ఇస్లామిక్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో పనులు నిలిపివేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ తెలిపారు. "మేము భయంతో ఉన్నాం. ఆ భయాందోళనల వల్లే పనులను తాత్కాలికంగా నిలిపివేశాం," అని ఆయన మీడియాకు వెల్లడించారు. సనాతన ధర్మంలో కీలకమైన దైవం విగ్రహ నిర్మాణంలో ప్రధాని తారిఖ్ రెహమాన్ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని కమిటీ సలహాదారు శ్యామ్లాల్ కుమార్ మహంత ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం
ఈ నెల ప్రారంభంలో గైబంధాలో ఇస్లామిక్ గ్రూపులు నిర్వహించిన నిరసనలో, శ్రీరాముడి చిత్రపటంపై ఒక షూ ఉంచి అవమానించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, నిందితులను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.
ఈ వివాదంపై శనివారం మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించనున్నారు. విగ్రహ నిర్మాణానికి తిరిగి అనుమతి ఇవ్వకపోతే, బంగ్లాదేశ్లోని 64 జిల్లాల్లో రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మళ్లీ తెరపైకి మైనారిటీల భద్రత అంశం
సుమారు 8 శాతం హిందూ జనాభాతో బంగ్లాదేశ్లో అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్న హిందువుల భద్రత, హక్కులపై ఈ వివాదం మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. గత మహమ్మద్ యూనస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తర్వాత హిందువులపై దాడులు పెరిగాయన్న నివేదికల నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రతి పౌరుడికి తమ మతాన్ని ఆచరించే హక్కు ఉందని ప్రధాని తారిఖ్ రెహమాన్ పదేపదే చెబుతున్నప్పటికీ, ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య దేశంలో 133 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు కావడం గమనార్హం.