పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు!
- మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు
- ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష
- హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు
- ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు
- పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
భారతదేశం, ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో కలిపి మొత్తం 22.8 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5,000 కేంద్రాలలో 2 లక్షల మందికి పైగా పోలీసు, భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రశ్నపత్రాల సురక్షిత రవాణా కోసం ఈసారి భారత వైమానిక దళం సాయం తీసుకున్నారు. అభ్యర్థులు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు పూర్తిగా మూసివేస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లో డిజిటల్ లీకేజీలను అరికట్టడానికి సిగ్నల్ జామర్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, టెలిగ్రామ్ వంటి యాప్లపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా, జాతీయ, మంత్రిత్వ శాఖల స్థాయిల నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏకంగా 1,38,560 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
పేపర్ లీకేజీల కారణంగా పరీక్ష రద్దు కావడం, ఆపై నెలకొన్న అనిశ్చితితో కొంతమంది విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురైన నేపథ్యంలో, ఈ రీ-ఎగ్జామ్ అభ్యర్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని తెచ్చింది. ఎలాంటి అదనపు రుసుము లేకుండా నిర్వహిస్తున్న ఈ రీ-టెస్ట్ కోసం పాత అభ్యర్థులే (13.3 లక్షల మంది మహిళలు, 9.5 లక్షల మంది పురుషులు) పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 3.6 లక్షల మంది విద్యార్థులతో అగ్రస్థానంలో నిలవగా, మహారాష్ట్ర (2.2 లక్షలు) తర్వాతి స్థానంలో ఉంది. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ముందస్తుగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయించడంతో వారి పరీక్ష సాయంత్రం 6:20 వరకు కొనసాగనుంది.