తొలి ఓవర్లోనే 23 పరుగులు.. 22 ఏళ్ళ రికార్డు బ్రేక్
- ఆఫ్ఘనిస్థాన్పై వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్
- 2004లో బంగ్లాదేశ్పై 22 పరుగుల రికార్డు బద్దలు
- యశస్వి జైపాల్ చెలరేగడంతో తొలి ఓవర్లోనే 23 పరుగులు
219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు, ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సింగిల్ కోసం పిచ్పై డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు అదనంగా లభించాయి.
దాంతో టీమిండియా 5/0తో ఇన్నింగ్స్ ఆరంభించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడటంతో, పెనాల్టీ పరుగులతో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. వైడ్లు, నో-బాల్స్తో కలిపి ఈ భారీ స్కోరు నమోదైంది. దీంతో 2004లో బంగ్లాదేశ్పై భారత్ నెలకొల్పిన 22 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఈ దూకుడైన ఆరంభంతో టీమిండియా కేవలం 28.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (79), యశస్వి జైస్వాల్ (110 నాటౌట్) అద్భుతమైన పునాది వేయగా, శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) కూడా తన వంతు సహకారం అందించాడు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ను భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కోలుకోలేని దెబ్బతీశాడు. కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ వేదికపై ఒక భారత పేసర్కు ఇది తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ప్రసిద్ధ్ ధాటికి ఆఫ్ఘన్ జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102) తన తొలి వన్డే సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఒమర్జాయ్ (50)తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అయితే, చివరి వరుస బ్యాటర్లు మరోసారి తడబడటంతో ఆఫ్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.