'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు
- మొహమ్మద్ ఫర్మాన్ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా
- తన కూతురుని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి ఫిర్యాదు
- ఆమె మైనర్ అంటూ ఆరోపణలు
- ఫర్మాన్పై పోక్సో కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
- తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మోనాలిసా
సోషల్ మీడియా పుణ్యమా అని దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ‘కుంభమేళా గర్ల్’ మోనాలిసా మతాంతర వివాహ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ మోనాలిసా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు... ఆమెకు, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్కు తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని ఈరోజు కీలకమైన తీర్పునిచ్చింది.
మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా, మొహమ్మద్ ఫర్మాన్కు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 11వ తేదీన తిరువనంతపురంలోని ప్రసిద్ధ అరుమనూర్ టెంపుల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు. అయితే మతాంతర వివాహం కావడం, పైగా మోనాలిసా వయసుపై అనుమానాలు రావడంతో ఇక్కడే అసలు కథ మొదలైంది.
మోనాలిసా తండ్రి తన కూతురిని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా ఈ వ్యవహారం ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్’ వద్దకు చేరింది. ఎస్టీ కమిషన్ జరిపిన లోతైన దర్యాప్తులో మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమెకు పెళ్లి వయసు రాలేదని తేలింది. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్పై పోక్సోతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు.
అయితే, అరెస్ట్ భయంతో ఫర్మాన్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా... కోర్టు అతని అరెస్ట్పై స్టే విధించింది. ప్రస్తుతం ఈ జంట కేరళలోనే తలదాచుకుంటున్నారు. అయితే తాము మతాంతర వివాహం చేసుకోవడం వల్ల మధ్యప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తుల నుంచి తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచరణ జరిపిన హైకోర్టు... ఆమెకు, ఆమె భర్తకు భద్రత కల్పించాలని తాజాగా పోలీసులను ఆదేశించింది.