‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం

Catch my wifes killers or I will die shocking truth revealed
  • బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు
  • ప్రేమ వివాహమే వివాదానికి కారణం
  • పరువు హత్యగా తేల్చిన పోలీసులు
  • భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు
  • సోదరుడి విచారణలో కీలక సమాచారం
దాదాపు రెండు నెలల పాటు భార్య ఆచూకీ కోసం ఓ యువకుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు... సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వేడుకున్నాడు... ‘నా భార్యను చంపిన వారిని అరెస్ట్ చేయండి... లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని హెచ్చరించాడు... చివరకు అతడి పోరాటమే ఓ దారుణ హత్య వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది.

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల సుజాత కుమారి అదృశ్యమైన కేసు ఇప్పుడు పరువు హత్యగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో సుజాతను ఆమె కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సుజాత, గౌరీశంకర్ కుమార్ చిన్ననాటి నుంచి ఒకరినొకరు తెలుసు. 2020లో మొదలైన ప్రేమ ఆరేళ్ల పాటు కొనసాగింది. ఈ ఏడాది జనవరిలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో యువతి కుటుంబం ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించింది.

తర్వాత కోర్టు ముందు హాజరైన సుజాత, తాను స్వచ్ఛందంగా పెళ్లి చేసుకున్నానని, భర్తతోనే జీవించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. కానీ హోలీ పండుగ సమయంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన ఆమె మార్చి 31 తర్వాత కనిపించకుండా పోయింది.

భార్య కనిపించకపోవడంతో గౌరీశంకర్ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాడు. దీంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో సుజాత సోదరుడిని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మే 8న సుజాతను గొంతు నులిమి చంపి తర్వాత నది ఒడ్డున మృతదేహాన్ని దహనం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో ఐదుగురికిపైగా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
Sujata Kumari
Gauri Shankar Kumar
Bihar Honor Killing
Muzaffarpur Crime News
Inter Caste Marriage Murder
Missing Woman Case

More Telugu News