ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్
- భారత్తో మూడో వన్డేలో 218 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్
- కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీతో (102) ఒంటరి పోరాటం
- 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్ కృష్ణ
- అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ సెంచరీ
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన నిప్పులు చెరిగే బంతులతో ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 105 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఒమర్జాయ్ అర్ధ సెంచరీ తర్వాత ఔటవ్వగా, షాహిది ఒంటరి పోరాటం కొనసాగించాడు. సహచరులు ఒక్కరొక్కరుగా పెవిలియన్కు క్యూ కడుతున్నా, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 131 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివరి వికెట్గా షాహిది ఔటవ్వడంతో ఆఫ్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లు నెగ్గిన భారత్... 2-0తో సిరీస్ ను చేజిక్కించుకుంది. నేటి చివరి మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ భీకర ఫామ్ లో ఉండడంతో 219 పరుగుల లక్ష్యం ఏమంత కష్టసాధ్యం కాదని అర్థమవుతోంది.