కాంగ్రెస్ నేత హత్య కేసు... 20 ఏళ్ళ తర్వాత నిర్దోషులుగా తీర్పు

Padamsinh Patil acquitted in Congress leader Pawanraje Nimbalkar murder case after 20 years
  • కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు
  • మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్‌ సహా 9 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
  • సాక్ష్యాధారాలు లేవంటూ అందరినీ విడుదల చేసిన ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు
మహారాష్ట్ర రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్‌తో సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను, తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తుది తీర్పు వెలువడింది.

2006 జూన్ 3న ఉస్మానాబాద్ (ప్రస్తుతం ధారాశివ్) జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ సమద్ కాజీని నవీ ముంబైలోని కలంబోలి వద్ద దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయ, వ్యాపార వైషమ్యాల కారణంగానే ఈ హత్య జరిగిందని, దీని వెనుక పవన్‌రాజే బంధువైన పదంసింగ్ పాటిల్ హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. టెర్నా షుగర్ ఫ్యాక్టరీ వివాదాలే హత్యకు దారితీశాయని, దాదాపు రూ. 30 లక్షల సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

ఈ కేసులో 2009లో పదంసింగ్ పాటిల్‌ను అరెస్టు చేయగా, అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. 2011లో ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా సామాజిక కార్యకర్త అన్నాహజారేతో సహా మొత్తం 128 మంది సాక్షులను కోర్టు విచారించింది. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, 20 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని తీర్పుకు ముందు పవన్‌రాజే కుమారుడు, శివసేన (యూబీటీ) ఎంపీ ఓంరాజే నింబాల్కర్ వ్యాఖ్యానించారు. తాజా తీర్పుతో మహారాష్ట్రలో అత్యంత సుదీర్ఘకాలం నడిచిన రాజకీయ హత్య కేసుల్లో ఒకదానికి తెరపడినట్లయింది.
Go Back to Shorts
Padamsinh Patil
Pawanraje Nimbalkar murder case
CBI court verdict
Maharashtra political murder case

More Telugu News