విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూన్ 30న విశాఖకు వస్తున్న రాష్ట్రపతి
- కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి
- కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30వ తేదీన విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రథమ స్నాతకోత్సవంలో 2021 నుండి 2026 విద్యా సంవత్సరాల మధ్య తమ కోర్సులు, ప్రోగ్రామ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సుమారు 400 మంది విద్యార్థులకు రాష్ట్రపతి స్వయంగా డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. వీరితో పాటు వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన 15 మంది టాపర్లకు గోల్డ్ మెడల్స్ కూడా ప్రదానం చేయనున్నారు.
రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతితో పాటు సీఎం, గవర్నర్ ఒకే వేదికపైకి వస్తుండటంతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.