ఉండవల్లిలో చంద్రబాబు, రామ్‌దేవ్.. ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం

Chandrababu Naidu and Baba Ramdev at Undavalli Caves to make AP a spiritual hub
  • ఉండవల్లిలో రామ్‌దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు
  • చంద్రబాబు ఓ కర్మయోగి అంటూ ప్రశంసించిన యోగా గురు రామ్‌దేవ్
  • అమరావతిని యోగ రాజధానిగా అభివర్ణించిన బాబా రామ్‌దేవ్
  • ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు
  • ప్రజారోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
చారిత్రక ఉండవల్లి గుహల ప్రాంగణం యోగా సాధనకు వేదికైంది. ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలో జరిగిన యోగా శిక్షణా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్, సీఎం చంద్రబాబు.. అభివృద్ధి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అనే అంశాలను మేళవించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసల వర్షం కురిపించగా, యోగా ప్రాధాన్యతను వివరిస్తూ రాష్ట్రంలో అమలు చేయనున్న పలు కీలక కార్య‌క్ర‌మాల‌ను చంద్రబాబు ప్రకటించారు.

ఈరోజు ఉదయం ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బాబా రామ్‌దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్.. చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమానాసన్, పవర్ యోగా వంటి కఠినమైన ఆసనాలను ప్రదర్శించి, వాటి ప్రాముఖ్యతను సీఎంకు వివరించారు. 'యోగాంధ్ర' లోగో ఉన్న షర్టు ధరించిన చంద్రబాబు, ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారని రామ్‌దేవ్ అభినందించారు.

చంద్రబాబు కర్మయోగి, అమరావతి యోగ రాజధాని: రామ్‌దేవ్
ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను, పనితీరును కొనియాడారు. "సీఎం చంద్రబాబు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు, కానీ నేను యోగా అతిథిగా వచ్చాను. ఆయన ఒక కర్మయోగి. ఆయనలా ప్రతి ముఖ్యమంత్రి పనిచేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన 'వికసిత్ భారత్ 2047' లక్ష్యం అనుకున్నదానికంటే ముందే సాకారం అవుతుంది" అని అన్నారు. 

అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించిన రామ్‌దేవ్, ఇప్పుడు ఇది 'యోగ రాజధాని'గా మారిందన్నారు. "రాజధానిని పచ్చదనంతో నింపుతున్నారు. స్విట్జర్లాండ్‌ను తలపించే అందాలు అమరావతిలో ఉన్నాయి. సీఎం చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, సర్వజన ప్రేమికుడు" అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి లక్ష్యాల సాధనకు చంద్రబాబు అందిస్తున్న సహకారం అమోఘమని కితాబిచ్చారు.

టెక్నాలజీకి ఆధ్యాత్మికత.. సంజీవనితో ప్రజారోగ్యం: సీఎం చంద్రబాబు
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, బాబా రామ్‌దేవ్‌తో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. "యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన రామ్‌దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఆయన వేలాది మందికి స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తున్నారు. 6, 7వ శతాబ్దాల నాటి, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న ఉండవల్లి గుహల్లో యోగా చేయడం విశేషం" అని అన్నారు.

"నేను 30 ఏళ్లుగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాను. రామ్‌దేవ్ బాబా యోగాను ప్రమోట్ చేస్తున్నారు. 'టెక్నాలజీ వితవుట్ అడిక్షన్' విధానంలో ముందుకు వెళ్లాలి. దీనికి యోగా, ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడతాయి" అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, 190 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాబా రామ్‌దేవ్‌ను కోరారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచడం, 20 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం, రసాయన రహిత పంటలను ప్రజలకు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యాలని వివరించారు. ప్రజారోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇందులో రోగ చికిత్స కంటే రోగ నివారణకు ప్రాధాన్యత ఇస్తూ యోగా, ప్రాణాయామం వంటివి చేరుస్తామని ప్రకటించారు. ఉద్యమ స్ఫూర్తితో యోగా సాధనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Baba Ramdev
Undavalli Caves
Amaravati Yoga Capital
Sanjeevani Project AP
Andhra Pradesh Spiritual Hub

More Telugu News