ఇండియా 'మౌగ్లీ గర్ల్' ఇకలేదు.. 18 ఏళ్లకే కన్నుమూత
- ఉత్తరప్రదేశ్కు చెందిన 'మౌగ్లీ గర్ల్' ఎహ్సాస్ కన్నుమూత
- 18 ఏళ్ల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మృతి
- 2017లో బహ్రైచ్ అడవుల్లో అధికారులకు లభ్యం
- ప్రభుత్వ సంరక్షణలో ఉంటూ మానవ జీవనానికి అలవాటుపడుతున్న వైనం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషాదంగా ముగిసిన పోరాటం
వివరాల్లోకి వెళితే.. జూన్ 15న లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ ఎహ్సాస్ తుది శ్వాస విడిచింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. జూన్ 11న ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే, జూన్ 15న ఆమె ఆరోగ్యం మళ్లీ అకస్మాత్తుగా క్షీణించడంతో వెంటనే తిరిగి ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా సెప్టిసెమియా (రక్తంలో ప్రాణాంతక ఇన్ఫెక్షన్) వ్యాపించడమే మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఘాజీపూర్ ఏసీపీ అనింద్య విక్రమ్ సింగ్ ధ్రువీకరించారు. ఆసుపత్రి డెత్ మెమో ఆధారంగా పోలీసులు అవసరమైన ఫార్మాలిటీస్ను పూర్తి చేశారు.
2017 జనవరిలో బహ్రైచ్లోని కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలో ఎహ్సాస్ను తొలిసారిగా అధికారులు గుర్తించారు. అప్పుడు ఆమె మానవ సమాజానికి పూర్తిగా దూరంగా, జంతువుల వలె నాలుగు కాళ్లపై నడుస్తూ, బట్టలు వేసుకోవడానికి నిరాకరిస్తూ కనిపించింది. మనుషులను చూస్తే దూకుడుగా ప్రవర్తించేది. ఆమె ప్రవర్తన రడ్యార్డ్ కిప్లింగ్ రాసిన 'ది జంగిల్ బుక్' కథలోని 'మౌగ్లీ' పాత్రను గుర్తు చేయడంతో ఆమెకు 'మౌగ్లీ గర్ల్' అనే పేరు స్థిరపడింది.
అడవిలో దొరికినప్పుడు బహ్రైచ్ బాలల సంక్షేమ కమిటీ ఆమెకు మొదట 'పూజ' అని పేరు పెట్టింది. ఆ తర్వాత లక్నోలోని మోహన్ రోడ్డులో ఉన్న నిర్వాణ్ ప్రభుత్వ ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి, 'ఎహ్సాస్' అని పేరు మార్చారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, మేధో వైకల్యం, మూర్ఛ వ్యాధులతో బాధపడుతోందని తేలింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేక సంరక్షణ, థెరపీతో ఆమెలో గణనీయమైన పురోగతి కనిపించింది. నెమ్మదిగా బట్టలు వేసుకోవడం, తనను చూసుకునే వారిని గుర్తించడం, సామాజిక జీవనానికి అలవాటుపడటం వంటివి నేర్చుకుంది.
సంరక్షణ కేంద్రంలో కేర్టేకర్గా పనిచేస్తున్న రాణితో ఎహ్సాస్కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆమెను 'అమ్మా' అని ఆప్యాయంగా పిలిచేదని రాణి గుర్తుచేసుకున్నారు. "ఎప్పటికైనా ఆమె పూర్తిగా కోలుకుంటుందని నేను నమ్మాను. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మాతో ఉన్నాయి" అంటూ రాణి కన్నీరుమున్నీరయ్యారు. అడవి నుంచి వచ్చి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పునరావాసానికి నిలువుటద్దంగా నిలిచిన ఎహ్సాస్ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగియడం తీవ్ర విషాదాన్ని నింపింది.