డీఎస్సీ అవకతవకలు, అమరావతి నిర్మాణ వ్యయంపై సీబీఐ దర్యాప్తు జరగాలి: వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy demands CBI probe into DSC irregularities and Amaravati construction cost
  • ఒక్కో పోస్టును రూ. 10 నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారన్న సుబ్బారెడ్డి
  • వేలాది మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని ఆవేదన
  • అమరావతిలో చదరపు అడుగుకు రూ. 20,500 ఖర్చు చేస్తున్నారని విమర్శ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని వైసీపీ సీనియర్ నేత   వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల క్షీణతపై కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు అమ్ముకున్నారని, స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారికి, వారి సానుభూతిపరులకే ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చుకున్నారని విమర్శించారు. దీనివల్ల వేలాది మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని, దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున నిధుల లూటీ జరుగుతోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. "కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ. 5,000 లోపే ఖర్చు చేస్తుంటే.. కూటమి ప్రభుత్వం అమరావతిలో చదరపు అడుగుకు ఏకంగా రూ. 20,500 అంచనా వ్యయం చూపిస్తోంది. దేశంలోని ఏ ప్రధాన నగరంలోనూ ఈ స్థాయి నిర్మాణ ఖర్చులు లేవు. అలాగే, జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు ఖర్చు పెడుతుంటే... ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో కిలోమీటర్‌కు రూ. 58 కోట్లు కేటాయించింది. రూ. 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని తమకు అనుకూలమైన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రయోజనాల కోసం దోచిపెడుతున్నారు" అని దుయ్యబట్టారు. ఈ భూముల కేటాయింపులు, వ్యయాలపై కూడా సీబీఐ విచారణ జరగాలన్నారు.

Go Back to Shorts
YV Subba Reddy
Andhra Pradesh DSC Scam
Amaravati Construction Cost
CBI Probe Demand
AP Government Corruption Allegations
DSC Paper Leak News

More Telugu News