అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్!
- అసోం విమాన ప్రమాదంలో అమరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్
- ఆయన కుటుంబానికి చెందిన పరిహారంపై చెలరేగిన వివాదం
- భార్యనంటూ రూ.21 లక్షల చెక్ తీసుకువెళ్లిన శ్రేయ రాయ్ అనే యువతి
- తమకు తెలియకుండా చెక్ ఇచ్చారని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ ఆరోపణ
- జోక్యం చేసుకోవాలంటూ రక్షణ మంత్రికి కుటుంబం విజ్ఞప్తి
వివరాల్లోకి వెళితే.. జూన్ 13న అసోంలోని జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ సమయంలో ఐఏఎఫ్ ఏఎన్-32 రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సిబ్బంది మరణించగా, వారిలో బిహార్లోని జెహనాబాద్ జిల్లా, బన్వారియా గ్రామానికి చెందిన 26 ఏళ్ల శుభం కుమార్ కూడా ఉన్నారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శుభం, ఆ కుటుంబానికి ప్రధాన ఆధారం. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు.
అయితే, బిహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన శ్రేయ రాయ్ అనే యువతికి అధికారులు అందజేశారు. ఈ విషయం అంత్యక్రియలు ముగిసిన తర్వాతే తమకు తెలిసిందని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ తెలిపారు. తమ కొడుకుతో శ్రేయకు పరిచయం ఉందని, ఈ ఏడాదిలో సంప్రదాయబద్ధంగా వివాహం చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే, వారికి కోర్ట్ మ్యారేజ్ అయిన విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. కనీసం శ్రాద్ధ కర్మలు పూర్తికాకముందే శ్రేయ చెక్ తీసుకుని వెళ్లిపోయిందని ఆరోపించారు.
ఒకవేళ వారి వివాహం చట్టబద్ధంగా జరిగి ఉంటే, పరిహారంపై ఆమెకు పూర్తి హక్కు ఉంటుందని, కానీ ఈ ప్రక్రియ మొత్తం తమకు తెలియకుండా జరగడంపైనే తమకు అభ్యంతరం ఉందని శర్మ స్పష్టం చేశారు. శుభం మృతదేహం వచ్చినప్పటి నుంచి అంత్యక్రియల వరకు శ్రేయ రాయ్ కుటుంబంతోనే ఉన్నారు. తమ కుమారుడే ఆధారంగా బతుకుతున్నామని, ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని శుభం కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.
ఈ పరిహారం చెల్లింపునకు ఏ పత్రాలను ప్రామాణికంగా తీసుకున్నారనే దానిపై అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అమర జవానుల పరిహారం విషయంలో చట్టపరమైన వైవాహిక స్థితి, కుటుంబ సభ్యుల అంచనాల మధ్య తలెత్తుతున్న సమస్యలకు ఈ ఘటన అద్దం పడుతోంది.