హైదరాబాద్లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం!
- భాగ్యనగరంలో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు
- జూన్ 23న అధికారిక ప్రారంభోత్సవం
- సీఎం రేవంత్, అమెరికా రాయబారి హాజరు
- ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకేనన్న ప్రభుత్వం
- బీజేపీ తీవ్ర అభ్యంతరం
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4)కి ముందే జరగనున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి (U.S. Ambassador) సెర్గియో గోర్, పలువురు ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, ఐటీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ ఐటీ రంగానికి, ఆర్థిక వృద్ధికి అమెరికా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా, అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గాను ట్రంప్ పేరును ప్రతిపాదిస్తూ గతంలో రేవంత్రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
గ్లోబల్ సిటీగా మార్చే వ్యూహం.. రేగిన రాజకీయ సెగ
హైదరాబాద్ను అంతర్జాతీయ ఆవిష్కరణల హబ్గా మార్చడంలో భాగంగా కీలక రహదారులకు గ్లోబల్ బ్రాండ్లు, ప్రముఖుల పేర్లు పెట్టే బృహత్తర ప్రాజెక్టులో ఇది భాగం. ఇటీవల రావిర్యాల ఇంటర్ఛేంజ్కు పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' పేరు పెట్టిన ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లను కూడా కొన్ని జంక్షన్లకు పెట్టాలని భావిస్తోంది. 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' కంటే ముందే అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ నిర్ణయంపై రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. రోడ్ల పేర్ల మార్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను తప్పుబడుతోంది. అయినప్పటికీ, ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రొఫైల్ మరింత పెరుగుతుందని, ఐటీ రంగంలోని లక్షలాది మంది యువ నిపుణులకు అమెరికా కంపెనీలతో మరిన్ని కొత్త అవకాశాలు దక్కుతాయని మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.