తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యం.. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యమెందుకని ప్రశ్న
  • రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిందన్న పవన్ కల్యాణ్
  • తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం జనసేన పనిచేస్తుందన్న పవన్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో సుమారు 1,200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "ప్రజలు ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల అది. అందుకే నాకు ఆ నేల పట్ల, అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉంది. ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా అనిపించింది" అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అమరవీరులకు నివాళులర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఈ సందర్భంగా ఆరోపించారు.

యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమ అసలు ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Pawan Kalyan
Janasena Party
Telangana Martyrs
Delhi Meeting
Telangana Movement
Andhra Pradesh Deputy CM

More Telugu News