కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు.. నేడు విచారణ
- చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు
- మానసిక వేధింపుల ఆరోపణలతో విడాకులు కోరిన భార్య సంగీత
- విజయ్, సంగీత మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం
- ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు ముందుకు వస్తున్న కీలక కేసు
విజయ్తో తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ సంగీత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, విజయ్ తనను మానసికంగా వేధించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించినట్లు సమాచారం. విడాకులతో పాటు విజయ్ సామాజిక, ఆర్థిక హోదాకు తగినట్లుగా భరణం, అలాగే చెన్నైలోని నీలంకరైలో ఉన్న వారి నివాసంలోనే తాను నివసించే హక్కును కల్పించాలని సంగీత కోరారు.
గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు విజయ్ గానీ, సంగీత గానీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు. తమ క్లయింట్లు ప్రముఖులు కావడంతో, వ్యక్తిగతంగా హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందువల్ల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు అనుమతించాలని న్యాయవాదులు కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో, సోమవారం జరగనున్న విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు వస్తారా? లేక వర్చువల్గా పాల్గొంటారా? అనేది వేచి చూడాలి. మరోవైపు, విజయ్-సంగీత జంటను తిరిగి కలిపేందుకు వారి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఇరువురి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రాజీ కుదిరే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది.