భారత్, పాక్ మ్యాచ్ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. పాత రికార్డు బ్రేక్..!

Fans flock to stadium for India vs Pakistan match old records broken
  • భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ సరికొత్త రికార్డు
  • రికార్డు స్థాయిలో 18,814 మంది అభిమానులు హాజరు
  • టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2026ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. నిన్న‌ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 18,814 మంది ప్రేక్షకులు హాజరుకావడం, టోర్నీ చరిత్రలోనే ఓ గ్రూప్ మ్యాచ్‌కు ఇదే అత్యధికం కావడం విశేషం.

మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో పోటెత్తిన అభిమానులు 
ఈ మ్యాచ్ ప్రేక్షకుల హాజరులో ఓ కొత్త చరిత్రను లిఖించింది. 2024లో దుబాయ్‌లో ఇదే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన 15,935 మంది రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు, భారత్-పాక్ మ్యాచ్‌లకున్న క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో గ్రూప్ 1లో భారత్ తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడమే కాకుండా టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత జట్టు ప్రదర్శనపై సచిన్ టెండూల్కర్ సహా పలువురు క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ఇక, మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 పరుగులు చేయగా, చివర్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. భారత బ్యాటర్లు చివరి 10 ఓవర్లలో ఏకంగా 105 పరుగులు సాధించడం వారి దూకుడుకు నిదర్శనం.

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి తలవంచింది. మునీబా అలీ (41) ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ దీప్తి శర్మ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించింది. ఈ ప్రదర్శనతో, దీప్తి మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 350 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా, పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.
Go Back to Shorts
India vs Pakistan Womens T20
Indian Womens Cricket Team
Smriti Mandhana
Deepti Sharma 5 wickets
Womens T20 World Cup 2026
Edgbaston record attendance

More Telugu News