భారతీయ నావికుల మృతి: ఈ బలహీన ప్రధాని దేశాన్ని కాపాడలేరంటూ రాహుల్ గాంధీ ఫైర్

  • హర్మూజ్ జలసంధిలో భారత నావికుల మృతిపై మోదీ సర్కార్‌ను నిలదీసిన రాహుల్ గాంధీ
  • అమెరికాకు ప్రభుత్వం దాసోహం అంటోందని తీవ్ర విమర్శలు
  • భారతీయుల మృతి పట్ల అమెరికాలో పశ్చాత్తాపం లేదని ఆవేదన
  • ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
  • ప్రభుత్వ స్పందన బలహీనంగా ఉందని విపక్షాల ఆరోపణ
హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం అమెరికాకు ఒక నమ్మకమైన సేవకుడిలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. అమెరికా ఏమాత్రం పశ్చాత్తాపం చూపకపోగా, వారి ఆదేశాలను పాటించని నౌకలను సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించడాన్ని ఆయన తప్పుబట్టారు.

"అమెరికా దాడుల్లో మన ముగ్గురు నావికులు చనిపోయి కొద్ది రోజులే అయింది. అయినా ఇంతవరకు వారి నుంచి కనీసం పశ్చాత్తాపం లేదు, క్షమాపణ లేదు. పైగా, మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. “అమెరికా సైన్యం ఆదేశాలను తక్షణమే పాటించాలి. ఎలాంటి ఉల్లంఘనలైనా సహించేది లేదు” అన్న వారి మాటలు చూడండి. ఒక స్వతంత్ర దేశం ఇలాంటి భాషను ఎప్పటికీ సహించదు. కానీ మన బలహీన ప్రధాని మాత్రం నోరు మెదపడం లేదు. ఒక విధేయుడైన సేవకుడిలా వారి ఆదేశాలను వింటున్నారు, పాటిస్తున్నారు. ఈ బలహీన ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు. ఎందుకంటే, దేశాన్ని అవమానించే వాళ్లే ఆయన నియంత్రణలో ఉన్నారు. అందుకే మన వాళ్లను చంపినా, మనల్ని అవమానించినా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఇది దేశ ప్రజలందరూ గమనించాలి" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన చాలా బలహీనంగా ఉందని, ఆయన కేవలం "ఇది సమర్థనీయం కాదు" అనడం సరికాదని అన్నారు. మరో నేత మనీశ్ తివారీ మాట్లాడుతూ, అమెరికా మంత్రి వ్యాఖ్యలు బెదిరింపుగా ఉన్నాయని, నావికుల మృతికి వారే కారణమన్నట్లుగా ఉన్నాయని ఆరోపించారు.

మరోవైపు, ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో మాట్లాడి, నావికుల మృతిపై తీవ్ర నిరసన తెలిపినట్లు వెల్లడించారు. వాణిజ్య నౌకలపై ప్రాణాంతక దాడులు సమర్థనీయం కాదని స్పష్టం చేసినట్లు తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది.

Rahul Gandhi
Narendra Modi
Indian sailors death
US military strikes
Strait of Hormuz
India US relations

More Telugu News