అమిత్ షా చెబుతున్న ఈ బియ్యం ప్రత్యేకత ఏంటి?

  • ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీతో రక్తహీనతను నివారించవచ్చన్న అమిత్ షా
  • 80 కోట్ల మందికి ఉచితంగా పోషకాలు నింపిన బియ్యం పంపిణీ
  • 2028 డిసెంబర్ వరకు పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
  • ఈ పథకం కోసం రూ. 17,082 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
  • ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలతో ఈ బియ్యం తయారీ
దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాలను అరికట్టేందుకు ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాలతో కూడిన బియ్యం) పంపిణీ ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది లబ్ధిదారుల ఆరోగ్యం స్థితిగతులు మెరుగుపడతాయని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

ఏమిటీ ఫోర్టిఫైడ్ బియ్యం?

ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ప్రత్యేకమైన వంగడం ఏమీ కాదు. మనం రోజూ తినే సాధారణ బియ్యానికే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడిస్తారు. ఈ ప్రక్రియలో బియ్యం గింజలపై పోషకాల పూత పూయడం లేదా పోషకాలతో కూడిన గింజలను సాధారణ బియ్యంలో కలపడం జరుగుతుంది. ఈ బియ్యం రుచి, వాసన, రంగులో సాధారణ బియ్యంలాగే ఉంటాయి. వండినప్పుడు కూడా ఎలాంటి తేడా ఉండదు.

ఎందుకింత ప్రాధాన్యం?

భారత్‌లో మహిళలు, పిల్లలతో సహా అన్ని వయసుల వారిలో ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత (అనీమియా) తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారం. ఇడ్లీ, దోశ, పులావ్, కిచిడీ వంటి ఎన్నో రకాలుగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అందుకే, ప్రజల ఆహారపు అలవాట్లను మార్చకుండా, వారి రోజువారీ భోజనం ద్వారానే పోషకాలను అందించేందుకు ఫోర్టిఫికేషన్ ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ₹17,082 కోట్లు కేటాయించింది.



Amit Shah
Fortified Rice
PMGKAY
Anemia Prevention
Malnutrition India
Central Cabinet Decision

More Telugu News