హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్!

  • రూ. 5000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్ట
  • 'ఇగ్నైట్' పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపిన క్యూనెట్ నిర్వాహకులు
  • ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్‌తో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్
హైదరాబాద్‌ పోలీసులు సుమారు రూ. 5,000 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నారు. 'ఇగ్నైట్' పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న మనీ సర్క్యులేషన్ నెట్‌వర్క్‌ను ఛేదించి, నలుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసేందుకు సిద్ధమైన ఈ ముఠా కుట్రను సీసీఎస్ పోలీసులు ముందే పసిగట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు 'ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్' పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సదరు సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 18 రోజుల్లోనే పోలీసులు రంగంలోకి దిగి, పెను నష్టం జరగకుండా నివారించడం విశేషం.

గతంలో నిషేధానికి గురైన క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్‌ల నిర్వాహకులే 'ఇగ్నైట్' పేరిట ఈ సరికొత్త మోసానికి తెరలేపినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) దర్యాప్తులో వెల్లడైంది. గత మూడు దశాబ్దాలుగా ఈ ముఠా వరుసగా గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్‌నెట్, క్యూనెట్, తాజాగా ఇగ్నైట్ రూపంలో వివిధ పేర్లతో ప్రజలను వంచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. భారీస్థాయిలో ప్రజలు ఆర్థికంగా నష్టపోకముందే ఇలాంటి మనీ సర్క్యులేషన్ రాకెట్లను గుర్తించి, వాటిని నిర్మూలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సజ్జనార్ వివరించారు.

Hyderabad Police
Ignite Scam
CP Sajjanar
5000 Crore Money Circulation Fraud
Operation Ignite Crackdown

More Telugu News