చైనాను కాపీ కొట్టొద్దు: భారత్కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా
- చైనాను అనుకరించకుండా సొంత వృద్ధి మార్గాన్ని భారత్ వెతకాలి
- ప్రముఖ ఇన్వెస్టర్ మార్టిన్ ఎస్కోబారి కీలక సూచన
- దేశ ఆర్థిక ప్రగతి విషయంలో ఓపిక అవసరమన్న ఎస్కోబారి
- 8 శాతం వృద్ధిరేటు చాలా గొప్పదని కొనియాడిన వైనం
- భారత్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్న నిఖిల్ కామత్
భారత్లో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన అనుభవంతో ఎస్కోబారి ఈ విశ్లేషణ చేశారు. చైనా తన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతి ఆధారిత తయారీ రంగాల ద్వారా అసాధారణ ప్రగతిని సాధించిందని ఆయన ఉదహరించారు. అయితే, చైనా అనుసరించిన విధానాలను యథాతథంగా అనుకరించడం భారత్కు శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టం చేశారు.
"భారత్ యొక్క సంక్లిష్టత, సంప్రదాయాలు మరియు వైవిధ్యానికి తగినట్లుగా ప్రత్యేకమైన వ్యూహాలు అవసరం. ప్రస్తుతం భారత్ నమోదు చేస్తున్న 8 శాతం వృద్ధి రేటు అభినందనీయం. దేశాభివృద్ధి విషయంలో కొంత ఓపిక అవసరం" అని ఆయన సలహా ఇచ్చారు.
ఈ సందర్భంగా నిఖిల్ కామత్ మాట్లాడుతూ, భారత్ సామర్థ్యాలపై తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని, భవిష్యత్తులో మన దేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ నుంచి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఎందుకు ఆవిర్భవించడం లేదన్న ప్రశ్నకు ఎస్కోబారి బదులిస్తూ, ఇక్కడి భారీ దేశీయ మార్కెట్ ఒక రకంగా ప్రతికూలంగా మారుతోందని విశ్లేషించారు. కంపెనీలు కేవలం స్థానిక అవసరాలకే పరిమితమై, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా ఒక స్వదేశీ కంపెనీ అంతర్జాతీయంగా రోల్ మోడల్గా నిలిస్తే, మిగిలిన సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తాయని ఆయన పేర్కొన్నారు.