కాంగ్రెస్లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ
- టీఎంసీ విలీన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్
- అవన్నీ వదంతులేనన్న కేసీ వేణుగోపాల్
- జాతీయ అంశాలపైనే చర్చించామని వెల్లడి
- మమత, రాహుల్తో మమత భేటీతో ఊహాగానాలు
- విలీనంపై ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే రెండు పార్టీల విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఆ సమావేశంలో జాతీయ రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని వేణుగోపాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలను మరింత సమర్థంగా ఎలా లేవనెత్తాలనే అంశంపైనే చర్చ జరిగిందన్నారు. విలీన ప్రతిపాదన గానీ, అలాంటి చర్చలు గానీ అస్సలు జరగలేదని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల టీఎంసీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసమ్మతి పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో టీఎంసీ విలీనం కావచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే అంశంపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ కూడా స్పందించారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అవసరమని చెప్పారు. అయితే అది కూటమి రూపంలో ఉంటుందా, విలీనం రూపంలో ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు విలీనంపై టీఎంసీ అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.