వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్‌-1 స్థానం

  • వార్షిక అప్‌డేట్‌ తర్వాత భారత్‌కు 118 పాయింట్లు
  • రెండో స్థానంలో న్యూజిలాండ్‌
  • ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం
  • మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
  • ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్‌
ఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక అప్‌డేట్‌ తర్వాత కూడా టీమిండియా నంబర్‌-1 స్థానంలో కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో పాయింట్ల తేడా మాత్రం కొంత తగ్గింది.

అప్‌డేట్‌కు ముందు భారత్‌కు 119 రేటింగ్‌ పాయింట్లు ఉండగా ఇప్పుడు 118 పాయింట్లకు చేరింది. మరోవైపు న్యూజిలాండ్‌కు రెండు పాయింట్లు పెరగడంతో ఆ జట్టు 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇరు జట్ల మధ్య ఉన్న ఎనిమిది పాయింట్ల అంతరం ఇప్పుడు ఐదు పాయింట్లకు తగ్గింది.

ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా 109 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టాప్‌-10లో చోటుచేసుకున్న ప్రధాన మార్పు నాలుగో స్థానంలో కనిపించింది. సౌతాఫ్రికా 102 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకుంది. పాకిస్థాన్‌ 98 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక దిగువ స్థానాల్లో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్‌ 11వ స్థానానికి చేరి జింబాబ్వేను వెనక్కి నెట్టింది. అమెరికా 13వ స్థానానికి ఎగబాకి, స్కాట్లాండ్‌ను అధిగమించింది.

వన్డేల్లో మాత్రమే కాదు. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కూడా భారత్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నంబర్‌-1 స్థానంలో ఉంది. మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియానే అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

India Cricket Team
ICC ODI Rankings
ICC Annual Update
Team India Number 1
ICC Mens Team Rankings
Cricket Ranking News

More Telugu News