శ్రీలంక ఈస్టర్‌ పేలుళ్ల కేసులో సంచలనం.. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌పైనే ఆరోపణలు

  • పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన
  • ఇస్లామిక్‌ తీవ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు
  • ఇప్పటికే అరెస్టైన సురేశ్‌ సల్లే
  • మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆంక్షలు
  • రాజకీయ లాభం కోసమే కుట్ర పన్నినట్లు ఆరోపణలు
శ్రీలంకను కుదిపేసిన 2019 ఈస్టర్‌ సండే పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ దాడులకు దేశ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ సురేశ్‌ సల్లేనే దిశానిర్దేశం చేశారని శ్రీలంక మంత్రి ఆనంద విజేపాల పార్లమెంట్‌లో వెల్లడించారు.

2019 ఏప్రిల్‌ 21న జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 279 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొలంబోలోని మూడు లగ్జరీ హోటళ్లు, రెండు కాథలిక్‌ చర్చిలు, మరో ప్రార్థనా మందిరం లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సురేశ్‌ సల్లే ఇస్లామిక్‌ తీవ్రవాదులతో కలిసి కుట్ర పన్నినట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. దాడులకు మూడు వారాల ముందు ఆయన కొందరు ముస్లిం వ్యక్తులను కలుసుకొని చర్చిల వివరాలు, అక్కడికి వచ్చే వారి సమాచారం సేకరించారని చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను సల్లే ఖండించారు. తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది ద్వారా స్పష్టం చేశారు. ఈ కేసులో ఫిబ్రవరిలోనే సల్లేను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆయన్ను విచారిస్తున్నారు. నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు మంత్రి తెలిపారు.

సల్లే విచారణ తర్వాత మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను కూడా త్వరలో విచారించే అవకాశం ఉందని సమాచారం. 2023లో బ్రిటన్‌కు చెందిన ఛానల్‌ 4 విడుదల చేసిన దర్యాప్తు కథనంలో కూడా సురేశ్‌ సల్లే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ కథనం ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం దాడులు జరగడానికి అవకాశం కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈస్టర్‌ పేలుళ్లకు రెండు రోజుల తర్వాత గొటబాయ రాజపక్స అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించుకుని, అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

Suresh Sallay
Sri Lanka Easter Sunday blasts
Gotabaya Rajapaksa
Sri Lanka intelligence chief
Easter Sunday terror attack
Ananda Wijepala

More Telugu News