రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ అత్యసవర సమావేశం.. అజెండా ఇదేనా?

Congress Party emergency meeting in Delhi tomorrow what is the agenda
  • బెంగాల్‌ పరిణామాల నేపథ్యంలో భేటీకి రాజకీయ ప్రాధాన్యం
  • ‘ఇండియా’ కూటమిని కాపాడుకోవడంపై చర్చించే అవకాశం
  • ఆర్థిక సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ
  • దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలు
  • ప్రాంతీయ పార్టీలతో బంధంపైనా చర్చించే అవకాశం
ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు, తృణమూల్ కాంగ్రెస్‌లో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ లోటస్ భయాల మధ్య కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది.

జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పరిణామాలు జరిగిన కొన్నిరోజులకే కాంగ్రెస్ ఈ అంతర్గత భేటీని నిర్వహంచనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపక్షాలు ఐక్యంగా ఎదుర్కొని వీగిపోయేలా చేశాయి. ఆ విజయాన్ని గత సమావేశంలో ఖర్గే అభినందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బలు తగిలాయి. వాటి నుంచి కోలుకుని, మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రణాళికను ఖర్గే రేపటి సమావేశంలో రాష్ట్రాల నేతలకు వివరించనున్నట్లు సమాచారం.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐను మోదీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఎలా పోరాడాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వాతావరణం దెబ్బతిన్నదని కాంగ్రెస్ భావిస్తోంది. కొత్త పెట్టుబడులు లేక ఉద్యోగాల సృష్టి నిలిచిపోయింది. ప్రైవేట్ గుత్తాధిపత్యం పెరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఈ సమావేశంలో కార్యాచరణను సిద్ధం చేయనుంది.

ముఖ్యంగా బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ పార్టీ నేతలు సోనియా, రాహుల్‌లతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ బంధం ఎలా ఉండబోతోందనే దానికి ఈ రేపటి సమావేశం దిక్సూచిగా మారనుంది.
Go Back to Shorts
Congress Party
Mallikarjun Kharge
India Alliance
Delhi Meeting
KC Venugopal
Operation Lotus

More Telugu News