మోదీ సరికొత్త చరిత్ర.. రాష్ట్రపతి అభినందనలు
- వరుసగా అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు
- ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ
- మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్న రాష్ట్రపతి
భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా అత్యధిక కాలం పాలించిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి మోదీ ఈ ఘనత సాధించారు. 2014 మే 26న తొలిసారి బాధ్యతలు చేపట్టిన మోదీ, నేటితో (బుధవారం) ప్రధానిగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. గతంలో నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా వరుసగా 4,398 రోజులు (1952 మే 13 నుండి 1964 మే 27 వరకు) పనిచేయగా.. ఇప్పుడు మోదీ ఆ రికార్డును దాటేశారు. ఈ జాబితాలో ఇందిరాగాంధీ (4,077 రోజులు) మూడో స్థానంలో ఉన్నారు.
ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చారిత్రాత్మక మైలురాయి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ సుదీర్ఘ పాలనే నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు. ఆయన హయాంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని, అట్టడుగు స్థాయి ప్రజలకు సైతం సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా ఆదివాసీల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం-జన్మన్', 'ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్' వంటి పథకాలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ముర్ము వెల్లడించారు. ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దార్శనికతతో ప్రధాని మోదీ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని, ఆయన స్ఫూర్తిదాయక ప్రస్థానం భావితరాల్లో భారత ప్రజాస్వామ్యంపై నూతన విశ్వాసాన్ని నింపుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.