పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు

  • పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం
  • ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన
  • ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
తెలంగాణలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపడుతుండగా, ఓ ట్రాక్ మెయింటెనెన్స్ మెషిన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై పక్కకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి స్టేషన్ సమీపంలో రైల్వే సిబ్బంది పట్టాల తనిఖీ, మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నలుగురైదుగురు సిబ్బంది ప్రయాణించేలా ఉండే ఈ ట్రాక్ తనిఖీ యంత్రం హఠాత్తుగా అదుపుతప్పి కార్మికుల వైపు దూసుకువచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది తక్షణమే పక్కకు తప్పుకోవడంతో ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఈ ప్రమాదం కారణంగా రైల్వే ట్రాక్ గణనీయంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యంత్రం పట్టాలు తప్పడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం దెబ్బతిన్న ట్రాక్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని, దీనివల్ల రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.                                

Peddapalli Railway Station
Telangana Railway News
Track Maintenance Machine Derailment
Railway Workers Narrow Escape
South Central Railway
Peddapalli Train Track Damage

More Telugu News