మరో వివాదంలో 'పెద్ది'... ఆదివాసీ సంఘాల ఫైర్
- రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై చెలరేగిన వివాదం
- గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణ
- విజయనగరం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆదివాసీ సంఘాలు
- చిత్ర బృందంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
చిత్రంలో సుమారు 15 సందర్భాల్లో తమను అవమానించేలా పదజాలాన్ని ఉపయోగించారని, ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని గిరిజన సంఘాల నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర బృందంతో పాటు సెన్సార్ అధికారులపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సినిమాలో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలాన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు అనుకరిస్తుండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 'పెద్ది' చిత్రంలో ఆదివాసీలను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. సెన్సార్ బోర్డు సైతం ఇటువంటి పదాలను ఉపేక్షించడం సరికాదని విమర్శించారు. నిషిద్ధ పదాలను ఉపయోగిస్తూ తమ సామాజిక వర్గాన్ని కించపరిచారని వారు మండిపడ్డారు. సనాతన ధర్మంలోని రామాయణం, మహాభారతాల్లో తమ పూర్వీకులు కీలక పాత్రలు పోషించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రం జూన్ 4న విడుదలైంది. 1980ల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే ఓ యువకుడి కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. సామాజిక న్యాయం ఇతివృత్తంగా వచ్చినప్పటికీ, విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. హీరోయిన్ జాన్వీ పాత్ర చిత్రీకరణపై విమర్శలు రావడంతో దర్శకుడు క్షమాపణలు చెప్పి కొన్ని సన్నివేశాలను తొలగించారు. తాజాగా గిరిజన సంఘాల ఫిర్యాదుతో 'పెద్ది' చిత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది.