మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి

  • ప్రధాని మోదీ బహూకరించిన ల్యాబ్-గ్రోన్ వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తి
  • యూఎస్ నిబంధనల ప్రకారం వజ్రం ప్రభుత్వ సొత్తుగా గుర్తింపు
  • మోదీ చెప్పిన ధర కంటే అమెరికా అధికారులు కట్టిన విలువే ఎక్కువ
  • ధర భారీగా ఉండటంతో సొంతం చేసుకోలేకపోయిన మాజీ ఫస్ట్ లేడీ
  • అధికారిక ఈవెంట్లలో ధరించి, వైట్ హౌస్ వీడాక తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తనకు బహూకరించిన ఒక అరుదైన వజ్రాన్ని తన వద్దే ఉంచుకోవాలని అనుకున్నానని, కానీ అమెరికా ప్రభుత్వ నిబంధనలు, దాని భారీ విలువల కారణంగా చివరికి దానిని వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చిందని అమెరికా మాజీ ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బైడెన్ (Jill Biden) వెల్లడించారు. ఈ వారం మార్కెట్లోకి విడుదలైన ఆమె ఆత్మకథ ‘వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ వింగ్: ఎ మెమోయిర్’ (View from the East Wing: A Memoir) పుస్తకంలో వైట్ హౌస్ జీవితం, విదేశీ పర్యటనల్లో వచ్చే బహుమతులపై ఉండే కఠినమైన నిబంధనల గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన జిల్ బైడెన్‌కు భారతదేశంలో స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 7.5 క్యారెట్ల కృత్రిమ వజ్రాన్ని (Lab-Grown Diamond) బహుమతిగా ఇచ్చారు. "ఆ వజ్రం చాలా అద్భుతంగా ఉంది. ల్యాబ్-గ్రోన్ వజ్రాల తయారీలో భారత్ సాధించిన ప్రగతికి అది ఒక ప్రతిరూపం. ఆ గిఫ్ట్ నన్ను ఎంతగానో ఆకర్షించింది" అని జిల్ బైడెన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

రూల్స్ అడ్డుపడ్డాయి
అమెరికా నైతిక నిబంధనల ప్రకారం వైట్ హౌస్ అధికారిక హోదాలో అందుకునే ఏ బహుమతి అయినా వ్యక్తిగత సొత్తు కాదు, అది అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికే చెందుతుంది. అయితే, సదరు బహుమతిని మార్కెట్ ధర చెల్లించి సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. "ఈ వజ్రం తన సొంత ఊరిలో 2,500 డాలర్ల (దాదాపు రూ. 2 లక్షలు)తో తయారైందని, దానికి సంబంధించిన బిల్లు కూడా ఉందని ప్రధాని మోదీ నాతో చెప్పారు. దాంతో, అంత తక్కువ ధర అయితే నేనే డబ్బులు కట్టి ఆ వజ్రాన్ని కొనేద్దామని అనుకున్నాను" అని జిల్ బైడెన్ పేర్కొన్నారు.

కానీ, ఆమె ప్లాన్ కాస్తా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వాల్యుయేషన్‌తో మారిపోయింది. అమెరికా అధికారులు ఆ వజ్రాన్ని పరిశీలించి దాని విలువ ఏకంగా 20,000 డాలర్లు (సుమారు రూ. 16.6 లక్షలు) గా నిర్ధారించారు. మోదీ చెప్పిన ధర కంటే అధికారులు కట్టిన విలువ చాలా ఎక్కువగా ఉండటంతో ఆమె ఆ వజ్రాన్ని సొంతంగా కొనాలనే ఆలోచనను విరమించుకున్నారు.

ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ వజ్రాన్ని కేవలం అధికారిక వేడుకల కోసం అద్దెకు తీసుకునే (Borrow) వెసులుబాటు ఉండటంతో.. జిల్ బైడెన్ దాన్ని ఒక ఉంగరంలో చేయించుకుని వైట్ హౌస్ ఈవెంట్లలో ధరించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం ముగిసి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఉంగరాన్ని తిరిగి ప్రభుత్వ స్టోరేజ్ రూమ్‌కు అప్పగించినట్లు ఆమె తెలిపారు. ఇదే సందర్భంలో ఫ్రెంచ్ ఫస్ట్ లేడీ బ్రిగిట్టే మాక్రాన్ ఇచ్చిన బ్రాస్‌లెట్ ధర తక్కువగా ఉండటంతో తానే సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నానని, ఉక్రెయిన్ ఇచ్చిన ఒక బ్రోచ్ విలువను అధికారులు 14,063 డాలర్లుగా తేల్చారని జిల్ బైడెన్ తన పుస్తకంలో గుర్తు చేసుకున్నారు.

Jill Biden
Narendra Modi
Lab Grown Diamond
View from the East Wing
White House Memoir
US Government Gift Rules
India US Relations
PM Modi Gift
State Department Valuation

More Telugu News