యూపీఐ పేమెంట్లో పొరపాటు.. వెతికి మరీ డబ్బులు తిరిగిచ్చిన డ్రైవర్
- ముంబై వ్యాపారవేత్త శుభమ్ గునే పొరపాటు
- మీటింగ్కు వెళ్లే హడావుడిలో పెద్దమొత్తంలో ఆటో డ్రైవర్కు డబ్బులు ట్రాన్స్ఫర్
- అదనపు మొత్తాన్ని చూసి ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్న ఆటోవాలా
- శుభమ్ రాగానే రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం డబ్బులు వెనక్కి
- ఆటో చార్జీ అయినా తీసుకోవాలని కోరినా నిరాకరణ
'హింగ్లిష్' (Hinglish) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన శుభమ్ గునే ఒక రోజు ఉదయం అత్యంత కీలకమైన క్లయింట్ మీటింగ్కు వెళ్లే క్రమంలో ఒక ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకున్నాక, తీవ్రమైన పని ఒత్తిడి, హడావుడిలో ఉన్న ఆయన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేశారు. ఆ సమయంలో నంబర్లను తప్పుగా టైప్ చేయడంతో రూ. 156 కి బదులుగా రూ. 15,682 డ్రైవర్ ఖాతాలోకి వెళ్లాయి. అది గమనించకుండానే శుభమ్ తన మీటింగ్కు వెళ్ళిపోయారు.
నిజాయతీతో పాటు ఉదారత్వం
దురదృష్టవశాత్తూ శుభమ్ హాజరైన ఆ బిజినెస్ మీటింగ్ ఘోరంగా విఫలమైంది. దానితో తీవ్ర నిరాశ, ఒత్తిడితో ఆయన తిరిగి ఆటో దిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఒక ఊహించని ఘటన ఎదురైంది. ఆటో డ్రైవర్ అల్తాఫ్ అప్పటికే అక్కడే ఆగి శుభమ్ కోసం ఎదురుచూస్తున్నాడు. శుభమ్ను చూడగానే పిలిచిన అల్తాఫ్.. పొరపాటున తన ఖాతాలో పడిన అదనపు మొత్తాన్ని (రూ. 15,682) చూపించి, ఆ డబ్బును పూర్తిగా తిరిగి ఇచ్చేశాడు.
ఈ నిజాయతీకి అబ్బురపడిన శుభమ్.. కనీసం ఆటో ఛార్జీ రూ. 156 అయినా ఉంచుకోవాలని ఎంత బతిమాలినా అల్తాఫ్ తీసుకోలేదు. "బాబూ.. మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది, ఈ రోజు మీకు కలిసి రాలేదని. ఇప్పటికే కష్టాల్లో ఉన్న మీ రోజును నా కారణంగా నేను మరింత ఇబ్బందికరంగా మార్చదలచుకోలేదు. ఈ ఛార్జీ కూడా నాకు వద్దు" అని అల్తాఫ్ సమాధానమిచ్చాడు.
ఈ హృదయపూర్వక సంఘటనను శుభమ్ గునే తన లింక్డ్ఇన్ (LinkedIn) ఖాతాలో పంచుకోగా, అది కాసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. ముంబై లాంటి నగరంలో రూపాయి కోసం అడ్డదారులు తొక్కే ఈ రోజుల్లో.. అల్తాఫ్ లాంటి సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఉదారత్వం, నిజాయతీ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక చేదు అనుభవంతో మొదలైన ఆ రోజు, ఒక మంచి మనిషి పరిచయంతో జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తుగా మారిందని శుభమ్ కృతజ్ఞత భావంతో పేర్కొన్నారు.