బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే

  • ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
  • నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఫలితాల అవకతవకలపై ఆందోళన
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై యువత గళమెత్తింది. సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తొలిసారిగా ప్రత్యక్ష నిరసన కార్యక్రమం చేపట్టింది. "బొద్దింకలు రోడ్డెక్కలేవన్న వారికి సమాధానంగానే మేము ఇక్కడికి వచ్చాం" అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నిరసనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నీట్-యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో దొర్లిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొన్నారు.

కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతలో కొందరిని ఉద్దేశించి 'బొద్దింకలు', 'పరాన్నజీవులు' అని చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన అభిజిత్ దీప్కే, ఈ అవమానాన్ని యువత నిరాశకు, నిరుద్యోగానికి ప్రతీకగా మార్చి ఆన్‌లైన్‌లో ఉద్యమాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే లక్షలాది మంది మద్దతుదారులను సంపాదించుకున్న ఈ ఉద్యమం, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటంగా రూపాంతరం చెందింది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యారంగ డిజిటలైజేషన్‌ లోపాలను సరిదిద్దడం, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టడం వంటివి తమ ప్రధాన డిమాండ్లని నిరసనకారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వెయ్యి మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Abhijit Dipke
Cockroach Janata Party
Jantar Mantar Delhi
NEET UG Paper Leak
Dharmendra Pradhan Resignation

More Telugu News