ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ

  • ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి.
  • విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు
  • ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు
  • రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారత స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ షేర్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు పెట్టే పెట్టుబడి పరిమితులను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన ఈ ప్రత్యేక సౌకర్యాన్ని విదేశాల్లో నివసిస్తున్న ఇతర వ్యక్తిగత ఇన్వెస్టర్లకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు.

దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ మరికొన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ బాండ్ల మార్కెట్లోకి విదేశీ మూలధనాన్ని తీసుకురావడానికి.. ‘ఫుల్లీ యాక్సెస్డ్ రూట్’ (ఎఫ్‌ఏఆర్‌) కింద 15, 30, 40 సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ప్రభుత్వ సెక్యూరిటీలను కూడా చేర్చుతున్నట్లు గవర్నర్ తెలిపారు. దీనితో పాటు జనరల్ రూట్ కింద విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) ఉన్న స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, ఇతర నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలతో దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడానికి సహాయపడతాయని సంజయ్‌ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనక్కి తీసుకురావడానికి గల కాలపరిమితిని తిరిగి తొమ్మిది నెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. భారత విదేశీ మారకపు రేట్ల విధానంలో ఎలాంటి మార్పులు లేవని.. రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని గవర్నర్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతల వల్ల ఒక్కోసారి మార్కెట్లో అంచనాలకు భిన్నంగా తీవ్ర ఒడుదొడుకులు వచ్చే అవకాశం ఉందని గవర్నర్‌ చెప్పారు. అలాంటి సమయాల్లో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకుండా ఆర్‌బీఐ కచ్చితంగా రంగంలోకి దిగి మార్కెట్‌ను నియంత్రిస్తుందని వివరించారు. తమ లక్ష్యం మార్కెట్ ఆధారిత మార్పులను అడ్డుకోవడం కాదని, కేవలం అస్తవ్యస్తమైన కదలికలను అదుపు చేయడమేనని స్పష్టం చేశారు.

Reserve Bank of India
Sanjay Malhotra
NRI investment limits
OCI equity investment
Indian stock market
Foreign Portfolio Investors
SEBI registration
Government securities
RBI monetary policy
Foreign investment India

More Telugu News