తెలంగాణ ప్రజల్లో 'తెలంగాణ' అనే భావన ఉంటుంది... కానీ ఆంధ్రా ప్రజల్లో 'ఆంధ్రా' అనే భావన లోపించింది: పవన్
- తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చటగా ఉంటుందన్న పవన్ కళ్యాణ్
- తెలంగాణ అనే బలమైన భావన వారిలో ఉందని ప్రశంస
- ఆంధ్రాలో మాత్రం ఐక్యత లేదని, ఉప ప్రాంతీయతలే ఉన్నాయని ఆవేదన
- ఆంధ్రా ప్రజల్లో కనీసం 'ఆంధ్ర' అనే ఉమ్మడి గుర్తింపు ఉండాలన్న పవన్
బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న ప్రాంతీయ అస్తిత్వంపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. "తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుందంటే, వారిలో తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళులకు వారి భాషా, ప్రాంతంపై అభిమానం ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్లో 'ఆంధ్రా' అనే ఉమ్మడి భావన కొరవడింది. ఇక్కడ సబ్-రీజనలిజం, కులతత్వమే ఎక్కువ" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను 'జై ఆంధ్ర' అని నినాదం ఇచ్చింది కూడా అందుకేనని పవన్ స్పష్టం చేశారు. కనీసం 'మేమంతా ఆంధ్ర' అనే ఒక ఉమ్మడి గుర్తింపు రాష్ట్ర శ్రేయస్సు కోసం అవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తన సూచనను ఉన్మాద స్థాయికి తీసుకెళ్లమని కాకుండా, రాష్ట్రం కోసం కనీస ఐక్యతను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మాట చెప్పానని వివరించారు. ఈ రకమైన ఉప ప్రాంతీయతలతో రాష్ట్రం ఇప్పటికే అన్ని రకాలుగా విడిపోయిందని, ఇకనైనా కలపడానికే ప్రయత్నించాలని ఆయన అన్నారు.