గుత్తి స్టేషన్లో రెండుగా విడిపోయిన యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
- గుత్తి స్టేషన్లో విడిపోయిన యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ బోగీలు
- లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ఎస్6, ఎస్7 బోగీల మధ్య విడిపోయిన కప్లింగ్
- ప్రయాణికులు సురక్షితం.. 30 నిమిషాలు ఆలస్యమైన రైలు
యశ్వంత్పూర్ నుంచి కతిహార్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు గుత్తి స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పైకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలులోని ఎస్6, ఎస్7 కోచ్ల మధ్య ఉన్న జాయింట్ కప్లింగ్ ఊడిపోవడంతో వెనుక ఉన్న బోగీలు రైలు నుంచి విడిపోయాయి. దీన్ని వెంటనే గమనించిన లోకో పైలట్, వేగాన్ని నియంత్రిస్తూ చాకచక్యంగా బ్రేకులు వేశారు. దీంతో విడిపోయిన బోగీలు నెమ్మదిగా వచ్చి ముందున్న రైలును తాకడంతో పెను ప్రమాదం జరగలేదు.
ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రైల్వే సిబ్బంది వెంటనే విడిపోయిన బోగీలను తిరిగి జత చేసి, పూర్తిస్థాయిలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. అనంతరం రైలు సుమారు 30 నిమిషాల ఆలస్యంగా గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది. సాంకేతిక కారణాల వల్లే కప్లింగ్ విడిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సిబ్బంది సత్వర స్పందనతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.